సూపర్ స్టార్ మహేష్ బాబు కొత్త చిత్రం ‘సర్కారు వారి పాట’ చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. పరశురామ్ ఈ సినిమాకు దర్శకుడు. షూటింగ్ మొదటి షెడ్యూల్ దుబాయ్ లో చేశారు. ఎడారిలో ఫైట్ సీక్వెన్స్ చేశారు. బ్యాంక్ నేపథ్యంలో కొన్ని కీలక సన్నివేశాలు తీశారు. ఈ షెడ్యూల్ ఇటీవలే ముగియగా కొత్త షెడ్యూల్ కోసం యూఎస్ వెళ్లాలని అనుకున్నారు. కానీ ఆ ప్లాన్ మళ్ళీ దుబాయ్ కు షిఫ్ట్ చేశారు.
ఈ నెల 22 న మొదలుకాబోయే ఈ షెడ్యూల్ ఏప్రిల్ 15వరకు అక్కడే జరుగుతుంది. ప్రస్తుతం దానికి సంబంధించిన ప్రిపరేషన్స్ చేస్తున్నారు టీమ్. ఈ షెడ్యూల్లో మహేశ్తో పాటు కీర్తీ సురేశ్, ఇతర ప్రధాన తారాగణం పాల్గొంటారని తెలుస్తోంది. నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎస్.ఎస్. తమన్ సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో ఈ సినిమా నిలవనుంది. ”సరిలేరు నీకెవ్వరు’ తర్వాత మహేష్ చేస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకుల్లో బోలెడన్ని అంచనాలున్నాయి.